Published On:

India Pakistan Ceasefire: కాల్పుల విరమణ ఉల్లంఘన.. భారత్ పైకి పాక్ దాడులు!

India Pakistan Ceasefire: కాల్పుల విరమణ ఉల్లంఘన.. భారత్ పైకి పాక్ దాడులు!

India Pakistan Ceasefire: భారత్- పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కాగా పహల్గామ్ దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై సైనిక దాడులు చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పైకి పాక్ దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. పాక్ దాడులను భారత ఆర్మీ ద్విగిజయంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ లోని సైనిక, ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

 

అయితే భారత్ ముందు పాకిస్తాన్ నిలవలేక కాల్పుల విరమణ ఒప్పందానికి దిగింది. ఈ మేరకు అమెరికాను సాయం కోరింది. ఈ నేపథ్యంలోనే భారత్, పాక్ తో చర్చలు జరిపామని.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించింది. దీంతో యుద్ధం ఆగిపోయిందన్నారు. మరోవైపు భారత డీజీఎంఓ తో పాకిస్తాన్ డీజీఎంఓ కాల్పుల విరమణపై ఫోన్ లో సంప్రదించారు. ఇక భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా కాల్పుల విరమణ జరిగినట్టుగా ప్రకటించారు. వెంటనే పాక్ విదేశాంగ కార్యదర్శి కూడా కాల్పుల విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి కాల్పుల విరమణ మాత్రమే జరిగిందని.. కానీ ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతూనే ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఈనెల 12న జరిగే చర్చలతో మిగిలిన అంశాలపై క్లారిటీ వస్తుందన్నారు. ఇదంతా బాగానే ఉంది.

 

కానీ భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తన వంకర బుద్ధిని చూపించింది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా, జమ్మూలోని కొన్ని ప్రాంతాలపై ఫిరంగి దాడులు జరిపినట్టు సమాచారం. రాజౌరీ సెక్టార్ లో పాకిస్తాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. బారాముల్లాలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. పాక్ ప్రయోగించిన ఒక డ్రోన్ ను కూల్చివేశాయి. మరోవైపు జమ్మూలోని పలన్వాలా సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగింది. అయితే జమ్మూలో జరుగుతున్న దాడులతో ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ జరిగినా శ్రీనగర్ లో బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని రాసుకొచ్చారు.

 

ఉదంపూర్ లో కూడా డ్రోన్లు కనిపించాయి. జైసల్మేర్, హరామినాలా, ఖావ్డాలో డ్రోన్లు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో పాకిస్తాన్ డ్రోన్లను గుర్తించారు. మరోవైపు కాల్పుల విరమణ జరిగినా దేశవ్యాప్తంగా అలర్ట్ గా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది. దాడులు ముగిసినా.. పాకిస్తాన్ నుంచి మళ్లీ దాడులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అనుకున్నట్టుగానే పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది. పలు ప్రాంతాల్లో రాత్రి ప్రయాణించే రైళ్లను రద్దు చేశారు. అలాగే ఎయిర్ పోర్టులలో భద్రతను పెంచారు.

 

Image