Published On:

Government Of India: త్వరలోనే జనగణన.. నేడే గెజిట్ నోటిఫికేషన్..!

Government Of India: త్వరలోనే జనగణన.. నేడే గెజిట్ నోటిఫికేషన్..!

Public Census Gazette Notification out Today: ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఈ ప్రక్రియకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. రెండు దశల్లో జనగణన ప్రక్రియ సాగనుందని తెలుస్తోంది. అయితే తొలిదశలో జమ్ముకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో 2026 అక్టోబర్ 1 నుంచి, రెండో దశలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి 1 నుంచి జనగణన చేపట్టనున్నారు.

 

అయితే ఈసారి జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా ప్రభుత్వం నిర్వహించనుంది. అందుకోసం మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలో సాగుతుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించే పోర్టల్, యాప్ లలో ప్రజలు సొంతంగానే వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ డేటా భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా దేశంలో ప్రతి పదేండ్లకొకసారి జనగణన జరుగుతుంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. అయితే 2021లో జనగణన చేయాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో 16 ఏండ్ల తర్వాత దేశంలో మరోసారి జనగణన జరగనుంది.