Assam CM on Pakistan: ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Assam CM Himanta Biswa Sarma on Pakistan- Balochistan: పాకిస్థాన్లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలిత బలోచిస్థాన్ ప్రావిన్స్లో అపారమైన ఖనిజ సంపద ఉన్నదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇంకా ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. ఈ నేపథ్యంలోనే బలోచిస్థాన్ ప్రావిన్స్ దశాబ్దాలుగా ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం హిమంత తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఖనిజ సంపద ఉన్నా నిర్లక్ష్యానికి గురి..
బలోచిస్థాన్ ప్రావిన్స్లో భారీగా ఖనిజ సంపద ఉన్నా నిర్లక్ష్యానికి గురువుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి ఆ ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ దోపిడీ ఎక్కువైందన్నారు. పాక్లోని మొత్తం ఖనిజ సంపదలో 80 శాతానికి పైగా బలోచిస్థాన్లోనే ఉందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అక్కడ భారీగా రాగి, బంగారు నిక్షేపాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించని సుమారు 5.9 బిలియన్ టన్నుల ఖనిజం, 41.5 మిలియన్ ఔన్సుల బంగారం, 35 మిలియన్ టన్నుల రాగి కూడా ఉందని సీఎం తెలిపారు.
బలోచిస్థాన్లో సుయ్ గ్యాస్ నిక్షేపాలు..
బలోచిస్థాన్లో సుయ్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు 1952లో కనుగొన్నారని సీఎం చెప్పారు. 2020 నాటికి పాక్కు సుమారుగా 56 శాతం సహజ వాయువును అందిస్తోందని హిమంత చెప్పుకొచ్చారు. బలోచిస్థాన్లోని గ్వదర్ ఓడరేవు 770 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నా.. ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్, ప్రాథమిక, మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. ప్రభుత్వ రంగ ఉపాధిలో బలోచిస్థాన్ ప్రావిన్స్ వాటా కూడా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సమృద్ధిగా వనరులు ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని తెలిపారు. బలోచిస్థాన్లో వనరుల కొరత లేదని, కానీ పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ దోపిడీ ఎక్కువగా ఉందని సీఎం ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం అస్సాం సీఎం పాకిస్థాన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.