High Court : కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దు : హైకోర్టు

High Court : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. ఈ క్రమంలోనే కోర్టు కేసును వాయిదా వేసింది. భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులోను విచారణ జరిగిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టులో పిటిషన్..
హెచ్సీయూ వద్ద ఉన్న 400 ఎకరాల్లోని చెట్లను నరికి వేస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు సుప్రీంను కోరారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని కోరారు. పిటిషన్పై ఇవాళ 3.45కు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పటి వరకు ప్రభుత్వం పనులు చేపడుతున్న స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. అప్పటి వరకు చెట్లను నరికివేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలుపగా, హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని జస్టిస్ బీర్ గవాయ్ స్పష్టం చేశారు.