Revanth Reddy: జనాలను పట్టించుకోని కేసీఆర్.. ప్రతిపక్షనేతగా ఎందుకు?

KCR: ప్రతిపక్షనేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఆగాయంటూ చేసిన కామెంట్స్ పై సీఎం రియాక్ట్ అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావు అడిగే ప్రశ్నలకే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని, అలాంటిది ప్రతిపక్షనేతగా తను అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. అసెంబ్లీకి రాను పిల్లలను పంపుతానని మాట్లాడుతున్నారు.. సభకు రాని కేసీఆర్ కు ప్రతిపక్షహోదా ఎందుకు? అని ప్రశ్నించారు.
సభలో ప్రజా సమస్యలు చర్చించని మీకు ఆ హోదా ఎలా ఇస్తారు ? అన్నారు. అధికారం ఉంటేనే బయటకు వస్తారని.. అధికారం లేకపోతే ఫామ్ హౌస్ నుంచి బయటకు రారా ? అని నిలదీశారు. అలా అయితే తాము వచ్చే పదేళ్లు కూడా అధికారంలో ఉంటామని, కేసీఆర్ ఆ పదేళ్లు ఫామ్ హౌస్ లోనే ఉండాల్సి వస్తుందని సీఎం రేవంత్ అన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత పదేళ్లు దగాకు గురైందని.. బీఆర్ఎస్ పాలన, పథకాల అమలుపై చర్చకు సిద్దమైనా అని సవాల్ చేశారు. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేసీఆర్ కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్.. తన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలు ఆగిపోయిందని అంటున్న కేసీఆర్.. ఆయన ప్రవేశపెట్టిన ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, కల్యాణలక్ష్మి, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షనేత పాత్రను సరిగా నిర్వహించని కేసీఆర్.. తమను ప్రశ్నించే అర్హత లేదన్నారు. గత 16 నెలలుగా అసెంబ్లీకి రాకుండా రూ. 60 లక్షల జీతం, ప్రభుత్వ బంగ్లా, కారు తీసుకుని ఫామ్ హౌజ్ లో పడుకున్నారని విమర్శించారు.