Adluri Lakshman : ఏటా 500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య : దస్త్రాలపై మంత్రి అడ్లూరి తొలి సంతకం

Adluri Lakshman takes charge as Minister: అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ తొలి సంతకం చేశారు. సచివాలయంలో 2వ అంతస్తులోని తన చాంబర్లో మంత్రిగా శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం తెలంగాణ వ్యాప్తంగా 844 మంది దివ్యాంగులకు రూ.5 కోట్లతో స్వయం ఉపాధి కల్పించే యూనిట్ల మంజూరు చేశారు. దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి, 2367 మందికి 3.50 కోట్లను పంపిణీ చేసే దస్త్రంపై సంతకం చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా ఇప్పటివరకు ఏటా 210 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్యను 500లకు పెంచారు.
అందుకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. మేడారం జాతరలో ఏర్పాట్లకు సంబంధించి రూ.45 కోట్లు, రూ.79.61 కోట్లతో గిరిజన విద్యాలయాల మరమ్మతు పనులు, మినీ గురుకులాల నిర్వహణకు 17.18 కోట్లు మంజూరు చేశారు. ఐఐటీ, నీట్లో ర్యాంకులను సాధించిన 100 మంది గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేందుకు ఆమోదం తెలిపారు. అనుమతులు మంజూరు చేశారు. కాగా, అడ్లూరి లక్ష్మణ్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, సంజయ్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.