Caste census: కులగణనపై కేంద్రం నిర్ణయం.. జనాభా లెక్కలతోనే

Cabinet meeting: దేశంలో కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో.. తగిన లెక్కలను త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
అయితే దేశంలో త్వరలో జరగబోయే జనాభా లెక్కలతోపాటు.. కులగణన కూడా చేయనున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ చాలాకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. చివరికి ఆ దిశగా అడుగులు వేయడం గమనార్హం. కులగణనపై కాంగ్రెస్ కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తోంది. అలాగే పలు రాష్ట్రాల్లోనూ కులగణన సర్వే చేయించిందని కేంద్రమంత్రి వైష్ణవ్ తెలిపారు. ఆ సర్వేలో పారదర్శకత లేదని.. కులాల సంఖ్య జనాభా లెక్కల్లో తేలుతుందని అన్నారు.
కాగా దేశంలో 2011 లో జనాభా లెక్కల సర్వే నిర్వహించారు. ఆ తర్వాత 2021లో మళ్లీ జనాభా లెక్కల సర్వే చేయాల్సి ఉండగా. కరోనా కారణంగా అది వాయిదా పడింది. త్వరలోనే దేశవ్యాప్తంగా జనగణన చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే కులగణన కూడా చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కలతో దేశంలో ఏయే కులాలు ఉన్నాయి, దేశంలో వాటి శాతమెంత వంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.