CM Revanth KCR Family : కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదు : చిట్చాట్లో సీఎం రేవంత్
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్త మంత్రులపై శాఖల కేటాయింపుపై ఆయన స్పష్టత ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కొన్ని నెలల వరకు మంత్రి పదవులు ఇవ్వలేదని, ఇచ్చినప్పటికీ శాఖలను కేటాయించలేదని గుర్తుచేశారు. తాను మాత్రం రెండు మూడు రోజులకే శాఖలు కేటాయించినట్లు తెలిపారు.
కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు..
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులని ఆరోపించారు. తాను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ లేదని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయాలని హైదరాబాద్ కలెక్టర్కు సూచించినట్లు పేర్కొన్నారు. వారు సర్వేలో వివరాలు పంచుకోలేదన్నారు. కాళేశ్వరంపై రెండు మూడు రోజుల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానని తెలిపారు.
కిషన్రెడ్డిపై ఫైర్..
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి అడ్డుపడుతుంది కిషన్రెడ్డే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాని మోదీకి ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్రెడ్డి నివేదిక ఇచ్చారా.. కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్లో తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కేంద్రమంత్రి ప్రస్తావించారా అంటూ నిలదీశారు.
నిర్మల సీతారామన్ చెన్నైకు మెట్రో తీసుకువెళ్లారని, ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారని మరి తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఏమి తీసుకురాలేదని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కిషన్రెడ్డి అడ్డుగా ఉన్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామన్నారు. 55 శాతం మేరకు ఇప్పటికే పదవులు కేయించామన్నారు. నక్సలిజానికి అంతం ఉండదని, సామాజిక సమానతలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.