KCR Kaleshwaram Inquiry : కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన కేసీఆర్ విచారణ
Former CM KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్కు కేసీఆర్ పలు డాక్లుమెంట్లను అందజేశారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్ ఎదుట కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.
కాళేశ్వరం విచారణలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్ నుంచి హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. విచారణ కోసం లోపలికి వెళ్లిన కేసీఆర్ తనకు జలుబు ఉందని కమిషన్కు చెప్పారు. ఈ క్రమంలోనే కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఓపెన్ కోర్టు విచారణను రద్దు చేసింది. కేసీఆర్ అనారోగ్యం వల్ల బహిరంగ విచారణను కమిషన్ రద్దు చేసింది. ఇండోర్లో ముఖాముఖిగా కేసీఆర్ను విచారించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ 114 మందిని విచారించింది. 115వ సాక్షిగా కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు.
యశోద ఆసుపత్రికి కేసీఆర్..
విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే జారి పడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముకలో గాయమైంది. వెంటనే అంబులెన్స్లో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పల్లా చికిత్స పొందుతున్నారు.