Ponnam Prabhakar: ఉనికి కోసమే కవిత లొల్లి.. మంత్రి పొన్నం కామెంట్స్

Minister ponnam react on brs mlc kavitha issue: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాజకీయ ఉనికి కోసమే ఆమె ఈ వ్యవహారం నడిపించారని అన్నారు. అందుకే ఆమె తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారని చెప్పారు. కవిత, బీఆర్ఎస్ పంచాయితీ టీకప్పులో తుపాన్ లాంటిదని ఎద్దేవా చేశారు. రాజకీయంగా అందరి దృష్టి మార్చేందుకే కవిత లెటర్ డ్రామా నడిపించారని ఆరోపించారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్ విచారిస్తోందని, కమిషన్ పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ పేరుతో నీళ్లు ఇస్తే పర్వాలేదని.. కానీ నీళ్ల పేరుతో బీఆర్ఎస్ నేతలు కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తరపున ప్రజల సమస్యలు విని పరిష్కరించేందుకు గతంలో గాంధీభవన్ లో ముఖాముఖి జరిగిందని, ఈ కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రజాపాలన కావాలని కోరుకున్న ప్రతి వ్యక్తికి గాంధీ భవన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతి దరఖాస్తును పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తామన్నారు. మంత్రులను కలవడానికి ఇబ్బంది కలిగినా కానీ తల్లి వంటి గాంధీ భవన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.