MLA Raja Singh : ఆ అధికారిని సస్పెండ్ చేయండి.. సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
MLA Raja Singh : చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. చార్మినార్లోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ను కలచివేసింది. మృతుల కుటుంబానికి ఊహించలేని దుఃఖాన్ని మిగిల్చింది. బాధితులకు మద్దతు అందించాల్సిన సమయంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
రూ.2.5లక్షలు చెల్లించాలని అధికారి డిమాండ్..
పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబం నుంచి రూ.2.5లక్షలు చెల్లించాలని అధికారి డిమాండ్ చేశాడు. ఇంట్లోని ఓ మహిళా సభ్యురాలి పట్ల అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారు. అధికారి ఆమె ఫోన్ను లాక్కొని బెదిరింపులకు దిగాడు. ఇప్పటికే బాధలో ఉన్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం దారుణం. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ యంత్రాంగానికి చెడ్డపేరు తెస్తాయి. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ నేపథ్యంలో పూర్తి దర్యాప్తు జరిగే వరకు సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణను ప్రారంభించాలన్నారు. అధికారిపై చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన రక్షణ, మద్దతు అందించాలని రాజాసింగ్ సీఎం రేవంత్కి రాసిన లేఖలో పేర్కొన్నారు.