Kavitha : అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్.. ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kavitha : తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ప్రాజెక్టు కోసం 90 శాతం పంప్హౌస్లు కట్టిన మెఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మహాధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ ఏం తప్పు చేశారు..?
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని నిలదీశారు. నీళ్లు తీసుకురావడం చేసిన తప్పా? తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం తప్పా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలేనా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాదని అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు.
కేసీఆర్ కాళేశ్వరం లాంటి మల్టీలెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆలోచన చేశారని తెలిపారు. కాంగ్రెస్ ఏనాడైనా ఆలోచన చేసిందా అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్లలో తెలంగాణకు కేవలం 16 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే.. దాన్ని కేసీఆర్ మార్చి 141 టీఎంసీలకు పెంచారని గుర్తుచేశారు. కాళేశ్వరంతో కేసీఆర్కు పేరు వస్తుందని బద్నాం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే ఇది నిజంగా సిగ్గుచేటన్నారు.
గోదావరి నుంచి 200 టీఎంసీల నీళ్లను బనకచర్లకు ఎత్తుకుపోతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్ ఎగరేసి చెబుతుంటే దీన్ని అడ్డుకునేలా లేఖ రాయడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకు ధైర్యం రావడం లేదని ప్రశ్నించారు. అఫెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టమని ఎందుకు అడగడం లేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం వద్ద లింకేజీ పాయింట్ ఉండాలని, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ మౌనంగా ఉందన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే చంద్రబాబు తెలంగాణ జల దోపిడీ చేస్తున్నా కిషన్రెడ్డి, బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ ఒక్కరే తెలంగాణ బిడ్డ ఉన్నారని, ఆయన సైతం మాట్లాడం లేదన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారన్న అపవాదు ఈటల తెచ్చుకోవద్దన్నారు. గోదావరి, పెన్నా లింకేజీ పాయింట్ తుపాకుల గూడెం వద్ద నుంచి ఉండేలా ఈటల ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ చర్యలు తీసుకోకపోతే తెలంగాణ జాగృతి తరఫున కార్యాచరణ తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
ఉర్దూలో ప్రసంగం..
కవిత తన ప్రసంగాన్ని ఉర్దులో కొనసాగించడం ఆసక్తిగా మారింది. ఎల్కతుర్తి సభలో ఉర్డూలో కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని, బీజేపీపై విమర్శలు చేయకపోవడాన్ని కవిత తన లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సమావేశంలో కవిత ఉర్డూలో మాట్లాడటంతో పాటు బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణకు రూ.8 నిధులు తేలేకపోయారని విమర్శించారు.