MP Raghunandan Rao : తెలంగాణ సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకోవాలి.. ఎంపీ రఘునందన్రావు

MP Raghunandan Rao : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనాకి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా.. టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకపోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్రావు అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ తిరుమలలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఫిబ్రవరి 1 నుంచి పరిగణలోకి తీసుకుంటామని పాలకమండలి నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్న టీటీడీ ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినా పాలకమండలి నిర్ణయం తీసుకున్నా టీటీడీ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదని ఫైర్ అయ్యారు. పాలకమండలి సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకొని అమలు చేయాలని సూచించారు. వేసవి సెలవులో సిఫార్సు లేఖలు ఇస్తామని, పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ హామీ ఇచ్చిందని, ఉమ్మడి రాష్ర్టం తరహలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.