Hyderabad: కాచిగూడ రైల్వేస్టేషన్ కు కొత్త అందాలు.. నేడే ప్రారంభం
Kacheguda Railway Station: వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన కాచిగూడ రైల్వేస్టేషన్ ను ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే రూ. 2.23 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. నేడు సాయంత్రం 5.30 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభిస్తారు. ఈ రైల్వేస్టేషన్ కు విజువల్ హైలెట్ గా, వారసత్వ చిహ్నంగా మార్చేందుకు జాతీయతను ప్రతిబింబించే థీమ్ తో కేంద్ర సర్కార్ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. రోజుకు వేల మంది ప్రయాణికులు స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో రైల్వేస్టేషన్ ను మరింత అందంగా తీర్చిదిద్దారు.
కాచిగూడ రైల్వేస్టేషన్ ముందుభాగం లైటింగ్ సిస్టం ద్వారా మన వారసత్వ నిర్మాణాల సౌందర్యం వెలికితీసేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 1916 లో నిజాం పాలనలో గోతిక్ నిర్మాణ శైలిలో కట్టిన కాచిగూడ రైల్వేస్టేషన్ ను ఇటీవల దాదాపు 785 లైటింగ్ ఫిక్చర్లతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. లైట్లు రాత్రి సమయంలో రైల్వేస్టేషన్ వాస్తు శిల్పకళ, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.