Harish Rao : ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి హరీశ్రావు

Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని, అయినా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశతో టన్నెల్ వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 8 మంది ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందన్నారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు.
ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు?
ఇంత పెద్ద ప్రమాదం జరిగి దేశం మొత్తం వారిని క్షేమంగా బయటికి తీసుకొస్తారని ఆశగా ఎదురుచూశారని, కానీ సీఎం రేవంత్ ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. టన్నెల్లో పనులు నిర్వహించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం ఒకసారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించలేదన్నారు. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో మంత్రులు విఫలమయ్యారని ఆరోపించారు.
ఇది కాంగ్రెస్ సర్కారుకు చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు? అని ప్రశ్నించారు. లోపల చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు. కూలీ కోసం రాష్ట్రానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.