Ration: వచ్చే నెలలోనే మూడు నెలల రేషన్.. కేంద్రం కసరత్తు

Telangana: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో వరదలు, ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై అధికారులకు లేఖలు రాశారు.
కాగా మూడు నెలల రేషన్ కు సంబంధించి మే 31 లోగా లబ్ధిదారులకు రేషన్ అందించాలని, ఇందుకోసం ముందస్తుగా బియ్యం లిఫ్టింగ్, పంపిణీ చేసేందుకు గొడౌన్లలో తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు.
అయితే జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ బియ్యాన్ని విడుదల చేస్తామని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్-1, స్టేజ్-2 గోదాముల్లో మే నెల పంపిణీ తర్వాత ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయో అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. వాటి ఆధారంగా జూన్, జులై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రేషన్ కోటాను జూన్ లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రతినెలా 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరం కానుండగా మూడు నెలలకు సంబంధించి సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని భావిస్తున్నారు .