Published On:

Twit in Raj Bhavan Theft: రాజ్‌భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్..!

Twit in Raj Bhavan Theft: రాజ్‌భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్..!

Twist in Raj Bhavan Theft Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజ్‌భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. తోటి మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ చేసి రాజభవన్ ఉద్యోగి భయబ్రాంతులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ఘటనలో నిందితుడిని పంజాగుట్ట పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. మార్ఫింగ్ ఫొటో విషయంలో మొదటిసారి అరెస్ట్ చేయగా, రెండోసారి రాజభవన్‌లోని హార్డ్ డిస్క్ చోరీ కేసు‌లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్ అయినప్పటికీ సెక్యూరిటీని మాయం చేసి రాత్రి సమయంలో ఎంట్రీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్టు కావడం సంచలనం రేపుతోంది.

 

ఇది నేపథ్యం..

రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ తన తోటి మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలు చూపించాడు. ఎవరో తనకు ఫొటోలు పంపిస్తున్నారని జాగ్రత్త ఉండాలని సూచించాడు. చాలా ఫొటోలను తన కంప్యూటర్‌కు పంపించాడని భయపెట్టాడు. దీంతో ఆందోళనకు గురైన మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్ఫింగ్ ఫొటోలు శ్రీనివాస్ పంపించాడని తేల్చారు. దీంతో శ్రీనివాస్‌ను అరెస్టు చేసి వారం కింద రిమాండ్‌కు పంపారు. ఘటనతో రాజ్‌భవన్ అధికారులు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. జైలుకు వెళ్లిన శ్రీనివాస్ రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

 

సెక్యూరిటీని మభ్యపెట్టి..

జైలు నుంచి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్లాడు. తన కంప్యూటర్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు రాజభవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫొటోలు ఉండడంతో సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది. దీంతో శ్రీనివాస్‌ను పోలీసులు రెండోసారి జైలుకు పంపారు.

 

ఫైళ్ల మాయంపై ఏసీపీ వివరణ..

మొదట రాజ్‌భవన్‌లో జరిగిన చోరీ కీలక హార్డ్ డిస్క్‌లు, ఫైళ్లు మాయమైనట్లు ప్రచారం జరిగింది. ఫైళ్ల మాయంపై పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ వివరణ ఇచ్చారు. రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళ తన ఫొటోలను ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ మార్ఫింగ్ చేసినట్లు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఈ నెల 12వ తేదీన శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. ఘటన తర్వాత శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని వివరించారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్‌ల కోసం శ్రీనివాస్ మరోసారి రాజ్ భవన్‌కు ఈ నెల 14వ తేదీన వచ్చి, హెల్మెట్ ధరించి హార్డ్ డిస్క్‌లను దొంగలించాడని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేసి శ్రీనివాస్‌పై మరో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. రాజ్ భవన్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు, ఫైళ్లు చోరీరి గురికాలేదని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో ఎలాంటి బయట వ్యక్తుల చోరీ జరగలేదని ఏసీపీ తేల్చి చెప్పారు.

 

ఇవి కూడా చదవండి: