KTR : సీఎం రేవంత్కు బీజేపీ ఎంపీ సపోర్ట్ : కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కారు ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. ప్రజాపాలనలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూమిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం విస్తుపోయిందన్నారు. 400 ఎకరాలు అటవీ భూమేనని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా చెబుతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక రూ.10 వేల కోట్ల కుంభకోణం ఉందన్నారు. కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ.. సీఎం రేవంత్ అంటూ ఆరోపించారు. మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అన్నీ తెలిసే భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
ఒక బీజేపీ ఎంపీ సహకారంతో..
ఒక బీజేపీ ఎంపీ సహకారంతో కుంభకోణ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ట్రస్టు ఎడ్వజైర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రేవంత్కి బ్రోకరిజం చేసిందన్నారు. అందుకుగాను ఆ కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారని ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు, ఆర్బీఐ గైడ్ లైన్సులను తుంగలో తొక్కారని చెప్పారు. అటవీ భూమిని రేవంత్ సర్కారు తాకట్టు పెట్టిందన్నారు.
అటవీ భూమిని అమ్మే అధికారం సర్కారుకు లేదన్నారు. వాల్టా, ఫారెస్టు చట్టాలను ఉల్లంఘించిందన్నారు. బీజేపీ ఎంపీ సారధ్యంలో బ్రోకరేట్ కంపెనీ తీసుకొచ్చారని తెలిపారు. ఎంపీకి రేవంత్ లబ్ధి చేకూరుస్తున్నారు. త్వరలో బీజేపీ ఎంపీ ఎవరో చెబుతానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తామన్నారు. కేంద్రం, ఆర్బీఐ, సీబీఐ, సెబీ, ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు చేయాలని కోరుతామన్నారు.
400 ఎకరాలకు టీజీఐఐసీకి యజమాని కాదు..
ఆ 400 ఎకరాలకు టీజీఐఐసీకి యజమాని కాదని స్పష్టం చేశారు. తమది కాని భూమిని టీజీఐఐసీ తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. మోసపూరిత భూమిని తాకట్టుపెట్టుకుని బ్యాంకు రుణం ఇచ్చిందన్నారు. ఆ 400 ఎకరాల భూమి విలువ రూ.5,239 కోట్లు అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలే చెప్పినట్లు పేర్కొన్నారు. అదే భూమి విలువ రూ.30 వేల కోట్లు అని రెవెన్యూ శాఖ చెప్పిందని వెల్లడించారు. లేని భూమి ఉన్నట్లు చూపి లోన్ తీసుకోవాలని చూశారని, భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.
ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీవీసీ, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 10వేల కోట్లు తెచ్చారన్నారు. వివాదంలో భూమికి ఐసీఐసీఐ బ్యాంకు ఎలా లోన్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వానికి రుణం ఇచ్చిందని పేర్కొన్నారు.