Accident in Mulugu: విషాదంగా ముగిసిన తీర్థయాత్ర.. ముగ్గురు మృతి

3 People died in Mulugu Road Accident: సంతోషంగా దైవదర్శనానికి వెళ్లివస్తున్న వారి ఆనందం విషాదంగా ముగిసింది. ములుగు జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 15 మందికిపైగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో ఇసుక లారీ- ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో మేడారం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామారం గ్రామా వాసులుగా గుర్తించారు. కాగా రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇసుక లారీ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.