‘Shining Star’ Awards : ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు : ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP Government : పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డులు ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ఏపీ సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు అవార్డులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో సర్కారు తెలిపింది. ఈ నెల 9వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అవార్డులు ప్రదానం చేయాలని అధికారులను సర్కారు ఆదేశించింది.
పదో తరగతిలో 500 (83.33 శాతం) మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మండలాలవారీగా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన వారికి అవార్డులు ఇవ్వనున్నారు. ప్రతి మండలంలో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురు పదో తరగతి విద్యార్థులకు అవార్డులు ఇస్తారు. వారిలో ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్లో 830, ఆపైన అత్యధిక మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు జిల్లాలవారీగా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ప్రతి జిల్లాకు 36 మంది చొప్పున ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నారు. అవార్డుకు ఎంపికైన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్తోపాటు రూ.20వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించి సన్మానించనున్నారు.