Chandrababu Speaks with Victim Sirisha: కుప్పం బాధితురాలికి రూ.5లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Spoke to victim Sirisha: చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధితురాలిని పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని సీఎం అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బంది పెట్టారని శిరీష వాపోయారు. ఘటనతో పిల్లలు, తాను భయపడుతున్నామని సీఎంకు బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది.
ఇలాంటి ఘటనలను సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీనిచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న బాధితురాలు శిరీష పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆమెకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీనిచ్చారు. ఘటన, అనంతర పరిణామాలపై నివేదిక ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం అందేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.