Renigunta Airport Name Change: రేణిగుంట విమానాశ్రయానికి తిరుమల శ్రీవారి పేరు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

BR Naidu on Renigunta Airport Name Change to Srivari: రేణిగుంట విమానాశ్రయానికి తిరుమల శ్రీవారి పేరు పెట్టాలని ధర్మకర్తల మండలి ప్రతిపాదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. పేరు మార్పుపై ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరారని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న శ్రీవారి ఆలయం చిన్నగా ఉందని, పెద్ద ఆలయం నిర్మించాలని డీకే కోరారని పేర్కొన్నారు. స్థలం కేటాయించగానే ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
టీటీడీకి 100 విద్యుత్ బస్సులు కేటాయిస్తామని కేంద్రమంత్రి కుమారస్వామి హామీనిచ్చారని తెలిపారు. టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల వల్ల తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. తిరుపతిలో సీఎస్ఐఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ల్యాబ్ నిర్మాణానికి స్థలం లీజు పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించామని వివరించారు. ల్యాబ్ ద్వారా నెయ్యి, నీరు, పప్పుధాన్యాల నాణ్యతను అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో 1600 మంది విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తామన్నారు. టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వడానికి మన వారసత్వం పేరుతో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని టీటీడీ చైర్మన్ తెలిపారు.