Published On:

Atrocities in Kuppam: సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో దారుణం.. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన వడ్డీ వ్యాపారి

Atrocities in Kuppam: సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో దారుణం.. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన వడ్డీ వ్యాపారి

Atrocities in CM Chandrababu Constituency: ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పట్టపగలు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

 

గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర శిరీష భర్త రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. మూడేళ్లు అయినా తిరిగి చెల్లించలేదు. శిరీష భర్త తిమ్మరయప్ప 6 నెలల కింద ఊరి విడిచి వెళ్లిపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమెను చెట్టుకు కట్టేశాడు. మునికన్నప్ప బంధువులు శిరీషపై దాడి చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో అప్పు ఇచ్చిన వ్యక్తిని అరెస్టు చేశారు. శిరీష కుమార్తె మధుశ్రీ దివ్యాంగురాలు. వచ్చిన 3 నెలల పింఛన్‌ను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 

సీఎం చంద్రబాబు సీరియస్..

కుప్పంలో మహిళపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని చంద్రబాబు ఎస్పీని ఆదేశించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

 

హోంమంత్రి అనిత పరామర్శ..

కుప్పంలో దాడికి గురైన మహిళను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని అనిత వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి బాధితురాలికి హామీనిచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరోవైపు కుప్పంలో బాధిత మహిళ శిరీషను వీడియో కాల్‌లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు. ఆసుపత్రికి వచ్చి పలువురు టీడీపీ నాయకులు శిరీషతో మాట్లాడారు. శిరీష ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శిరీష కుటుంబానికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: