Chandrababu on Swachhta Awards: ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం: ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu on Swachhta Awards: ఆంధ్రప్రదేశ్లో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ట పర్చేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయటంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ వరకు విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతోపాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని స్పష్టం చేశారు. 87 పట్ణణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంట్లర్ల ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి ‘స్వచ్ఛత’ అవార్డులు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలి..
అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు ‘సర్క్యులర్ ఎకానమీ’పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. 90 రోజుల్లో రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు.