CM Chandrababu : 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తుచేయడం సంతోషం : సీఎం చంద్రబాబు

CM Chandrababu : తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తుచేయడం సంతోషం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో ఏ ఇజం లేదు.. టూరిజం ఒక్కటేనని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. రెండోరోజూ కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ఈ సందర్భంగా టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు..
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను సభలో సాంబశివరావు ప్రస్తావించారు. ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు.. ఉన్నదంతా టూరిజమేనని నాడు చంద్రబాబు అనేవారని గుర్తుచేశారు. చంద్రబాబు నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం అంటూ శాసన సభలో అభిప్రాయపడ్డారు. పత్రికలో వచ్చిన వార్తను కలెక్టర్ల సదస్సుల్లో టూరిజం అంశంపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఏ ఇజం లేదు అని తాను నాడు అంటే కమ్యునిస్టులు తనపై విరుచుకుపడ్డారని, తనపై విమర్శలు కూడా చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యే మాట్లాడతూ.. ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ నేడు స్టేట్మెంట్ ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. తాను చెప్పిన మాటలు, తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు..
ఇప్పుడు అంత సమయం లేదని, త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నారు. ఏపీలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్దికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ది ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టాలని సూచించారు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎకనమీ పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజమని వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా పనిచేస్తే టూరిజం పెద్ద ఉపాధి మార్గం అవుతుందని స్పష్టం చేశారు.