Nara Lokesh : వన్ క్లాస్-వన్ టీచర్ నినాదంతో ముందుకెళ్తున్నాం : మంత్రి నారా లోకేశ్

Education Minister Nara Lokesh : రాష్ట్రంలోని 80 శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు అందించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు విద్యార్థులకు అందించామన్నారు. మిగిలిన 20శాతం మందికి ఈ నెల 20లోగా అందిస్తామని స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామన్నారు. కొందరి ఖాతాలు యాక్టివ్ లేక నిధులు తిరిగి వచ్చాయని, ఆయా ఖాతాలు యాక్టివ్ చేసుకోవాలని తల్లులను కోరుతున్నామన్నారు. ఖాతాలు యాక్టివ్ అయ్యాక తల్లికి వందనం నగదు జమ చేస్తామని తెలిపారు.
సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం..
సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 9,600 పాఠశాలల్లో వన్ క్లాస్-వన్ టీచర్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఏడాదిలో చూపిస్తామన్నారు. సర్కారు బడులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచాలనేదే తమ లక్ష్యమని, అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం వర్తించదని తెలిపారు.
వైసీపీ హయాంలో విద్యాశాఖ నాశనం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖను నాశనం చేశారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఏం చేశారో తకు తెలియదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది చదువుతున్నారో తెలుసుకునేందుకు వందరోజులు పట్టిందన్నారు. వైసీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.