Pakistan: సింధూ నీళ్లను మళ్లిస్తే బాంబు దాడులు చేస్తారట

Pakistan: సింధూ నదిపై నిర్మించే ఏ నిర్మాణాన్నైనా పేల్చివేస్తామన్నారు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ వ్యవసాయ భూమికి 80% కు నీటిని అందించే సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో అసహనాన్ని వ్యక్తం చేస్తోంది పాక్. సింధూ జలాలను మళ్ళించేందుకు నిర్మాణాన్ని చేపడితే పేల్చివేస్తామన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడారు. ఆసిఫ్ రక్షణ మంత్రి అయినప్పటికీ అతనికి నియంత్రణ లేదన్నారు. అతను కేవలం ‘స్టేట్మెంట్ మినిస్టర్’ అని అన్నారు.
పాకిస్థానీలలో భయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు షానవాజ్. భారత్ ఇస్తున్న షాకులకు పాక్ నాయకులు నిద్రను కోల్పోయారన్నారు. ఇప్పటికే జల, ఆర్థికపరమైన నిర్ణయాలను తీసుకుని పాక్ ను ఇరుకున పెట్టింది భారత్. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 28 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో తీసుకున్న చర్యలలో సింధూ జలాలను నిలిపి వేసింది. ఒప్పందం రద్దు చేయడం వలన సమీప భవిష్యత్తులో నీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆనకట్టకు నీటిని నిరోధించే లేదా మళ్లించే సామర్థ్యం లేదు.
గత వారం, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో-జర్దారీ మాట్లాడుతూ “నీరు లేదా భారత్ రక్తం సింధు గుండా ప్రవహిస్తుంది” అని అన్నారు. పాకిస్తాన్కు చెందిన నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏదైనా ప్రయత్నాన్ని “యుద్ధ చర్య”గా పరిగణిస్తామని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. అయితే ఇప్పటికే భారత్ తీసుకున్న నిర్ణయాలకు పాకిస్థాన్ ఆర్థికంగా కుదేలైంది. పాకిస్థాన్ పౌరులు మాత్రం ఆదేశప్రధాన మంత్రిని దుమ్మెత్తిపోస్తున్నారు. తమకు ఉద్యోగాలు, తినడానికి తిండి కావాలని, సరిగ్గా కరెంటు కూడా లేని దేశానికి యుద్ధమెందుకని అంటున్నారు.