Iran attacked on Israel US embassy: అమెరికాను కవ్విస్తున్న ఇరాన్.. అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి!

Iran attacked on Israel US embassy: అమెరికాను ఇరాన్ కవ్విస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో అమెరికా దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా ప్రతి దాడులు చేస్తుందా అనే భయాందోళనలు కలుగుతున్నాయి.
ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇందులో తాజాగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పైకి ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణి…తాజాగా టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. అయితే ఇరాన్ క్షిపణి దాడి ఫలితంగా అమెరికా దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధృవీకరించారు. అయితే ఇరాన్ క్షిపణి దాడి ఫలితంగా అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది ఎవరూ గాయపడలేదు.
అయితే టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఇరాన్ అసలు లక్ష్యంగా చేసుకుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. లేదా యాధృచ్చికంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణి….అమెరికా దౌత్య కార్యాలయన్ని తాకిందా అనేది ఇప్పటివరకు తెలియరాలేదు. అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఇరాన్ లక్ష్యం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ వరకు అది దుస్సాహసం కిందనే లెక్క. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను ఇరాన్ మిలటరీ కవ్వించడమే. అమెరికాను కవ్విస్తే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఇరాన్ కు తెలియనిది కాదు. ఇరాన్ ఏ రూపంలో తమపై దాడులు చేసినా, తమ వైపు నుంచి తీవ్ర దాడులు ఉంటాయని ఇప్పటికే అనేక సార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హెచ్చరించారు.
కాగా టెల్ అవీవ్ పై ఇరాన్ జరిపిన తాజా దాడులపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి ఖట్జ్ స్పందించారు. టెల్ అవీవ్ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ఖట్జ్ ఆరోపించారు. ఇందుకు ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఆయన. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇప్పడు ఒక నర హంతకుడిలా మారాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ రక్షణమంత్రి ఖట్జ్ ఒక పోస్టు పెట్టారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ ను నిలిపివేయించాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ పౌరులను టార్గెట్ గా చేసుకుని ఆయొతుల్లా ఖమేనీ దాడులు చేయిస్తున్నాడని ఖట్జ్ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులను కొనసాగిస్తోంది. ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్ లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది.ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.దీంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చాలని ఇరాన్ చూస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన శత్రువని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చేయాలన్నదే డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యమన్నారు నెతన్యాహు. ఈ నేపథ్యంలోనే అణు ఒప్పందం చర్చలను ట్రంప్ తెరమీదకు తెచ్చారని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే అణ్వాయుధాలు తయారు చేసి తీరాలని ఇరాన్ డిసైడ్ అయి ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. దీంతో ట్రంప్ ను హతమార్చాలని ఇరాన్ సైన్యం వ్యూహాలు పన్నిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటు ఆరోపణలు చేశారు.