Published On:

Israel-Iran War: ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం.. మళ్లీ ఆ రోజులే గుర్తొస్తున్నాయ్..!

Israel-Iran War: ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం.. మళ్లీ ఆ రోజులే గుర్తొస్తున్నాయ్..!

Israel-Iran War: మనకు మనం ఆధునికులం అని చెప్పుకుంటాం. ఎంతో గర్వపడతాం. అయితే ఇదంతా మాటలకే పరిమితం. తాజా పరిణామాలను చూస్తుంటే ఇది.. యుద్దాల కాలమా అనే అనుమానం వస్తోంది. ఓ వైపు పాలస్తీనా – ఇజ్రాయెల్ వార్ నడుస్తుంటే.. మరో వైపు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం. ఈ రెండు చాలవన్నట్లు ఇపుడు తాజాగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య సంఘర్షణలు మొదలయ్యాయి.

 

మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశించి చాలా కాలమైంది.మనకు మనం ఆధునికులం అని చెప్పుకుని గొప్పలు పోతుంటాం. మనం నిజంగా ఆధునికులం అయితే.. ప్రస్తుత ప్రపంచంలో అసలు ఇన్ని యుద్ధాలు జరుగుతాయా..? రష్యా – ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమై మూడేళ్లు దాటింది. అలాగే పాలస్తీనా – ఇజ్రాయెల్ వార్ ప్రారంభమూ మూడేళ్లు కావస్తోంది. తాజాగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి.

 

ఉక్రెయిన్ పై ర‌ష్యా 2022 ఫిబ్రవరి 24న దాడులు మొద‌లు పెట్టింది. యుద్ధం ప్రారంభమై మూడు సంవత్సరాలు దాటింది.   మూడేళ్ల క్రితం వరకు జ‌నంతో కిట‌కిట‌లాడిన ఉక్రెయిన్ న‌గ‌రాల్లో ఇప్పుడు ఎటు చూసినా శ‌వాల గుట్టలే క‌నిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు  ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ఏమాత్రం వీలున్నా ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స‌ పోయారు.

 

అయితే ఉక్రెయిన్ ఇప్పటికీ రావణకాష్టంలా తగలబడుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన తొలిరోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మీద ఉన్నాడు. ఇతర ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని.. ఒకవేళ జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించాడు. సహజంగా ఉక్రెయిన్‌కు అమెరికాతో  మంచి సంబంధాలున్నాయి. యుద్దం ప్రారంభమైన మొదలే పుతిన్ వార్నింగ్ ఇవ్వటంతో అది పరోక్షంగా అమెరికాకి ఇచ్చారు. అంతేకాకుండా.. నాటో కూటమి దేశాలకు కూడా పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు.

 

2023.. అక్టోబరు ఏడో తేదీ. ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసిన రోజు. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌పైకి  వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పైకి రాకెట్ల వర్షం కురిపించారు హమాస్ మిలిటెంట్లు. దీంతో ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. యుద్దం ప్రారంభమై ఇప్పటికీ మూడేళ్లు కావస్తోంది. అయినా, యుద్దం ఇంకా చల్లారలేదు.

 

గత దశాబ్దకాలంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే హమాస్ దాడులకు ప్రధాన కారణమైంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఎడాపెడా దాడులు మొదలెట్టింది. గాజా ప్రాంతం స్మశానంలా మారేంతవరకు ఇజ్రాయెల్ నిద్రపోయేలా లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తోంది యుద్ధం కాదు. నెతన్యాహు నాయకత్వంలోని ఇజ్రాయెల్  సర్కార్ చేస్తోంది జెనోసైడ్. అంటే మూకహత్యలే.

 

తాజాగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. కాగా ఇజ్రాయెల్ దాడులకు ఒక నేపథ్యం ఉంది. ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి.దీంతో తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ పై అమెరికా ఒత్తిడి చేసింది. అయితే అణు ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ అంగీకరించలేదు. అంతిమంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఏమైనా యుద్దం ఎప్పుడూ వేడుక కాదు. ఈ నగ్న సత్యాన్ని దేశాధినేతలు అర్థం చేసుకోవాలి.