Pawan Kalyan : సినిమాలో డైలాగ్లు అక్కడే బాగుంటాయి

Pawan Kalyan On YS Jagan: అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినిమా డైలాగుల చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ స్పందించారు.
మూవీలో చెప్పే డైలాగ్లు థియేటర్ వరకే బాగుంటాయన్నారు. డైలాగ్లను అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం, నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని తేల్చిచెప్పారు. పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలన్నారు. సమర్థించేలా మాట్లాడేవారి నేర ఆలోచనను ప్రజలంతా గమనించాలన్నారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం నేరమేనని మరచిపోవద్దని పవన్ తెలిపారు.