Bangladesh’s Key Decision: బంగ్లా కీలక నిర్ణయం.. భారత్తో రూ.180 కోట్ల రక్షణ కాంట్రాక్టు రద్దు!

Bangladesh Cancelled Rs 180 Crore Contract with India: భారత్-బంగ్లా దేశాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా నుంచి ఢాకా ఒక్కో అడుగు దూరం పెడుతుంది. ఈ క్రమంలోనే రూ.180.25 కోట్ల విలువైన రక్షణ కాంట్రాక్టును ఆ దేశం రద్దుచేసుకున్నది. సముద్రంలో వాడే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణానికి ఉద్దేశించిన కాంట్రాక్టు నుంచి వైదొలిగింది. నౌకను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) తయారు చేస్తున్నది. ఈ మేరకు బంగ్లా ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్కు జీఆర్ఎస్ఈ వెల్లడించింది.
బంగ్లా ఎగుమతులపై కేంద్రం నిషేధం..
భారత్ ఓడరేవులను బంగ్లా ఉపయోగించుకోవడంతోపాటు రోడ్డుమార్గంలో వచ్చే బంగ్లాదేశ్ ఎగుమతులపై కేంద్రం ఈ నెల 18వ తేదీన నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ఒప్పందాన్ని ఢాకా రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది. బంగ్లా నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్కతా, నవ సేవ నౌకాశ్రయాల గుండా ఇండియాలోకి అనుమతిస్తామని తెలిపింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కలప ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్, వంటి వాటిని మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం, ఫుల్బరి, కస్టమ్స్ స్టేషన్స్ గుండా రోడ్డు మార్గంలో ఇండియాలోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. దాదాపు 5 వారాల క్రితం ట్రాన్స్షిప్మెంట్ అవగాహనను ఇండియా రద్దు చేసింది. దీంతో ఇతర దేశాలకు ఇండియా గుండా రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని బంగ్లా కోల్పోయింది.