Bombs : బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు.. వేలమంది ప్రజలు ఖాళీ

Germany : జర్మనీలోని కొలోన్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలోని మూడు బాంబులను కనుగొన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబులు ఉన్న ప్రాంతానికి సమీపంలోని 20వేల మందికి పైగా పౌరులను ఇతర ప్రాంతాలకు తరలించారు. నగరానికి సమీపంలోని చర్చిలు, క్రీడామైదానాల్లో ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. కొలోన్కు కొంత కాలంపాటు రవాణా మార్గాలు మూసివేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా అంబులెన్సులు, భద్రతా బలగాలను మోహరించామని అధికారులు తెలిపారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీపై వేసిన బాంబుల్లో పేలని మూడింటిని సోమవారం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. బాంబులను అగ్రరాజ్యం అమెరికా తయారు చేసినట్లుగా భావిస్తున్నారు. రెండు బాంబుల బరువు చెరో 1,000 కిలోలు ఉన్నాయి. మరొకటి 500 కిలోలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. బాంబులను నిర్వీర్యం చేయడానికి ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదేశాన్ని 1,000 మీటర్ల వరకు డేంజర్ జోన్గా ప్రకటించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు బాంబులు పేలితే, కిలో మీటర్ల మేర తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు.
1939లో పోలాండ్పై జర్మనీ డాడి చేసింది. దాడితో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీ సేనలను అణచివేసేందుకు అమెరికా, బ్రిటన్ దళాలు జర్మనీపై వేలకొద్ది బాంబులు వేశాయి. ఇప్పటికీ జర్మనీలో పెద్దసంఖ్యలో పేలని బాంబులు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. 2017లో ఫ్రాంక్ఫర్ట్లో 1.4 టన్నుల బాంబు లభ్యమైంది. 2024లో 31 బాంబులను కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ నగరాలపై 1.5 మిలియన్ బాంబులు వేసింది. ఇందులో 20 శాతం బాంబులు పేలకుండానే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.