Murali Mohan: ఒకే సినిమాకు.. ఏపీ, తెలంగాణ అవార్డులు వద్దు – మొరళీ మోహన్ కామెంట్స్

Murali Mohan Comments Telugu State Film Awards: దాదాపు పదకొండేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులన ప్రకటించింది. సినీ పరిశ్రమను ప్రొత్సహిస్తూ 2024 ఏడాదికిగానూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, జ్యురీ చైర్మన్ మొరళీ మోహన్ ఆధ్వర్యంలో విజేతలను నిర్ణయించారు.
2024లో వచ్చిన సినిమాల్లోని అన్ని కేటగిరీలకు అవార్డులను ప్రకటించగా.. తాజాగా 2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు బెస్ట్ ఫిలిం అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా నటుడు మొరళీ మోహన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకే సినిమాకు తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు అవార్డులు ఇవ్వడం మంచిది కాదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
“ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలి. ఒక ఏడాది తెలంగాణ ఇస్తే.. మరో ఏడాది ఆంధ్ర రాష్ట్రాల ప్రభుత్వాలు పురస్కారాలను ప్రకటించాలి. ఎందుకంటే తెలంగాణ ఈ సినిమాకు.. ఆంధ్ర ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారి తీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించిన తెలుగు ప్రేక్షకులంత ఒక్కటే. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. తెలుగు సినిమాలను మనకంటే ముందుకు విదేశీవాళ్లు చూస్తున్నారు” అని మొరళీ మోహన్ పేర్కొన్నారు.