Preity Zinta Moved to Court: వివాదంలో పంజాబ్ కింగ్స్ జట్టు.. కోర్టుకెక్కిన జట్టు యజమాని ప్రీతి జింటా!

Preity Zinta has Moved to Court on PKBS Team: పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం చెలరేగింది. జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టుకెక్కింది. జట్టు సహ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ పిటిషన్ వేసింది.
ఈ ముగ్గురు కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎల్లోని పంజాబ్ జట్టు ఈ కంపెనీదే. ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశం(ఈజీఎం) చట్టబద్ధతను ప్రీతిజింటా కోర్టులో సవాల్ చేసింది. కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండా సమావేశం నిర్వహించారని తన పిటిషన్లో పేర్కొంది. సమావేశానికి సంబంధించి అభ్యంతరాలను తాను ఏప్రిల్ 10వ తేదీన ఈమెయిల్ రూపంలో తెలియజేసినా పట్టించుకోలేదని ప్రీతి పేర్కొంది. నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బర్మాన్ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించింది.
తాను, మరో డైరెక్టర్ కరణ్పాల్ భేటీకి హాజరైనప్పటికీ సమావేశం చట్టబద్ధత చెల్లదని ప్రకటించాలని ప్రీతి కోర్టును కోరింది. ఈ భేటీలో మునీశ్ ఖన్నాను డైరెక్టర్గా నియమించడాన్ని ప్రీతి జింటా, పాల్ వ్యతిరేకించారు. డైరెక్టర్గా ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని ప్రీతి తన పిటిషన్లో కోర్టును కోరింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కంపెనీ అమలు చేయకుండా చూడాలని అభ్యర్థించింది. కేసు పరిష్కారం అయ్యేవరకు తాను, కరణ్పాల్ లేకుండా బోర్డు భేటీ నిర్వహించకుండా చూడాలని ప్రీతి జింటా కోర్టును కోరారు.
బోర్డులో వివాదాలు ఉన్నా.. ప్రీతి జింటా పంజాబ్ మ్యాచ్లకు హాజరై స్టేడియంలో జట్టుకు మద్దతుగా నిలిచింది. ఆటగాళ్లను ప్రోత్సహించింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ ఈ సీజన్లో బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల అనంతరం జట్టు ప్లేఆఫ్స్కు చేరింది. టాప్-2లో స్థానం లక్ష్యంగా ముందుకుసాగుతోంది.