Rajasthan : అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య కీలక భేటీ

Ashok Gehlot, Sachin Pilot Meet : రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలే గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో శనివారం వీరిద్దరూ భేటీ అయ్యారు. గెహ్లాట్ నివాసంలో జరిగిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు పెట్టారు. తన తండ్రి, మాజీ కేంద్రమంత్రి రాజేశ్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించడానికి మాజీ ముఖ్యమంత్రిని కలిసినట్లు సచిన్ తెలిపారు. భేటీకి సంబంధించిన వీడియోను అశోక్ గెహ్లాట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్ పైలట్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
1980లో రాజేశ్ తాను ఒకేసారి లోక్సభలో అడుగు పెట్టామని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఇద్దరు మధ్య 18 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. రాజేశ్ ఆకస్మిక మృతి తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్నారు. మరోవైపు అశోక్ సచిన్ పైలెట్ మధ్య సయోధ్య కుదిరిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజేశ్ పైలట్ వర్ధంతి కార్యక్రమంలో గెహ్లాట్ పాల్గొంటే మంచి పరిణామమేనని ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు.
2018 నుంచి అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ ఇద్దరు మధ్య ఆదిపత్య పోరు నడుస్తుంది. 2020లో సీఎంగా ఉన్న గెహ్లాట్పై అసమ్మతి స్వరం వినిపిస్తూ.. నాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. నెల రోజులపాటు రాజకీయ సంక్షోభం కొనసాగింది. తర్వాత ఇద్దరూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. దీంతో గొడవ మరింత ముదిరింది. కాంగ్రెస్ పెద్దలు ఇద్దరు మధ్య సఖ్యత కుదుర్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.