Published On:

Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టుల మృతి

Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టుల మృతి

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో కొన్నిరోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపుర్‌ జిల్లాలోని నేషనల్ పార్కులో ఆపరేషన్ జరుగుతోంది. మూడోరోజూ జరిగిన ఆపరేషన్‌లో మరో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనాస్థలిలో 2 ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీహైడ్రేషన్‌, పాముకాటు, తేనెటీగలు దాడి చేయగా, కొందరు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. గాలింపు సందర్భంగా మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. మూడు రోజులుగా నేషనల్ పార్కులో మావోలకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ కొనసాగుతోంద. గడిచిన రెండు రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్‌, భాస్కర్‌ మృతి చెందారు. సుధాకర్‌పై రూ.కోటి, భాస్కర్‌పై రూ.25లక్షల రివార్డ్‌ ఉంది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి.

 

80 కిలోమీటర్ల మేర నేషనల్ పార్కు విస్తరించి ఉంది. అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు సురక్షిత ప్రాంతంగా భావించారు. విస్తీర్ణంలో ఒక్క పోలీస్‌ స్టేషన్‌, క్యాంప్‌ గాని లేదు. దాన్ని మావోలు అవకాశంగా తీసుకుని స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు నేషనల్ పార్కును చుట్టుముట్టినట్లు సమాచారం. ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, కోబ్రా దళాలు పాల్గొన్నాయి.

 

కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్‌మడ్‌ పర్వతాలతోపాటు నేషనల్‌ పార్కులో అణువణువూ భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొద్దిరోజుల కింద పార్టీ దళపతి బస్వరాజ్‌ ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. నేషనల్‌ పార్కులో ఇప్పుడు అగ్ర కమాండర్లు మృతిచెందుతున్నారు. ఇదే ప్రాంతంలో భారత బలగాలకు మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేత మడావి హిడ్మా ఉన్నట్లు సమాచారం. అతడి లక్ష్యంగానే ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: