India Won the Women Tri- Series: విమెన్ ట్రై సిరీస్.. ఫైనల్లో శ్రీలంకపై భారత్ విక్టరీ

India won the Women Tri- Series in IND Vs SL: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. ఇవాళ భారత్- శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా విమెన్స్ టీమ్ శ్రీలంకపై 97 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత జట్టు అమ్మాయిలు అద్భుతంగా రాణించారు.
కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా విమెన్స్ టీమ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మందాన సెంచరీతో రాణించగా, హర్లీన్ డియోల్ 47, హర్మన్ ప్రీత్ కౌర్ 41, జెమిమా రోడ్రిగ్స్ 44 రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో మల్కి మదార, దేవ్మి విహంగా, సుగంధిక కుమారి తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 343 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి తిగిన శ్రీలంకకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హాసిని పెరీరా ఫస్ట్ ఓవర్లోనే డకౌట్ అయింది. అనంతరం గుణరత్నే, కెప్టెన్ అథపత్తు కలిసి రెండో వికెట్ కు 68 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత గుణరత్నే ఔట్ కాగా.. నీలాక్షి డిసిల్వాతో కలిసి కెప్టెన్ అథపత్తు మరో 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా 173 పరుగులకు 3 వికెట్లతో పటిష్ట దశలో కనిపించిన లంక జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. 19 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయింది. చివరిలో సుగంధిక కుమారి, అనుష్క ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. చివరికి 48.2 ఓవర్లలో 245 పరుగులకు శ్రీలంక జట్టు ఆలౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో రాణించగా.. అమన్ జ్యోత్ కౌర్ మూడు, శ్రీ చారని ఒక వికెట్ పడగొట్టి సత్తా చాటారు.