Covid-19 Cases in India: కరోనా డేంజర్ బెల్స్.. 7 వేలు దాటిన యాక్టీవ్ కేసులు!

Covid-19 Cases in India: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 101 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా బారినపడి గత 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నివేదిక విడుదల చేసింది. దీంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 7264 కేసులకు చేరింది. అలాగే ఈ ఏడాది కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 108కి చేరింది.
అత్యధికంగా కేరళలో 1,920 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గుజరాత్ లో 1,433, వెస్ట్ బెంగాల్ 747, ఢిల్లీ 649, కర్ణాటక 591, మహారాష్ట్ర 540, ఉత్తరప్రదేశ్ 275, రాజస్థాన్ 222, తమిళనాడు 220 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. నిన్న కేరళలో ఏడుగురు చనిపోగా.. ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చనిపోయారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచిస్తోంది. అలాగే కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. మరోవైపు కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.