Published On:

Pawan Kalyan : సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసే టీఎంసీ నేతలపై చర్యలేవీ..? : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan : సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసే టీఎంసీ నేతలపై చర్యలేవీ..? : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

AP Deputy CM Pawan Kalyan fires on TMC MPs : ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇన్‌ఫ్లూయెన్సర్‌, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ అభ్యంతరకర పోస్టు పెట్టింది. దీంతో కోల్‌కతా పోలీసులు శనివారం విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థి అరెస్టుపై ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

 

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను పవన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో న్యాయ విద్యార్థిని ఓ వీడియోను పోస్టు చేసింది. తన మాటలు కొంతమందికి బాధ కలిగించేవిగా ఉన్నాయని గ్రహించింది. వెంటనే పోస్టును తొలగించి, క్షమాపణలు చెప్పింది. బెంగాల్‌ పోలీసులు వేగంగా స్పందించి విద్యార్థినిపై చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ కోట్లాది మంది బాధకు కారణమైన నాయకులు, టీఎంసీ ఎంపీల సంగతి ఏంటి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వారి వ్యాఖ్యలకు క్షమాపణలు ఎక్కడ? వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? దైవదూషణను ఎప్పుడూ ఖండించాలన్నారు. లౌకికవాదం రెండు వైపులా ఉండాలన్నారు. కొందరికి కవచం.. మరికొందరికి ఖడ్గం కాకూడదన్నారు. బెంగాల్‌ పోలీసులు అందరిపట్ల ఒకేలా వ్యవహరించాలని పవన్‌ రాసుకొచ్చారు.

 

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించింది. ఆపరేషన్‌పై స్పందించని బాలీవుడ్‌ నటులను ఉద్దేశిస్తూ న్యాయ విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెంటనే తొలగించి క్షమాపణలు కోరింది. ఈ క్రమంలోనే విద్యార్థినిపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

ఇవి కూడా చదవండి: