NIA raids : దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో ఎన్ఐఏ తనిఖీలు.. పాక్ గూఢచర్యంపై దర్యాప్తు వేగవంతం

National Investigation Agency : జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబయి, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాలు వీటిలో ఉన్నాయి.
తనిఖీల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలు దొరికాయి. పాక్ నుంచి గూఢచర్యం రాకెట్ను నడిపిస్తున్న ఆపరేటివ్ల సమాచారాన్ని తెలుసుకోవడానికి వీటిని విశ్లేషిస్తామని అధికారులు వెల్లడించారు. గూఢచర్యానికి అవసరమైన ఆర్థిక సహకారాలు వీరి నుంచి అందినట్లు తాము అనుమానిస్తున్నామని చెప్పారు.
గత నెల 20న ఎన్ఐఏ ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. అతడు 2023 నుంచి పాకిస్థాన్కు సున్నితమైన సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నట్లు గుర్తించారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారే అంశాలు ఉన్నాయి. అతడికి భారత్లోని పలువురు వ్యక్తుల నుంచి నిధులు అందేవి. ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపాటు పలువురిని గూఢచర్యం కేసులో దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాసిమ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సున్నితమైన సమాచారాన్ని అతడు పాక్కు చేరవేసినట్లు తెలుస్తోంది.