Operation Kagar: పాకిస్తాన్ మాట వింటారు.. మా మాట వినరా..?

Maoist ask to PM Modi to Call the Discussion: పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరితే సరేనన్న ప్రధాని మోదీ ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకుంటలేదని ప్రశ్నించారు మావోయిస్టులు. ఇందుకుగాను దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరుతో మావోయిస్టులు లేఖను రిలీజ్ చేశారు. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై లేఖలో చర్చించారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్ జరిగిందని అన్నారు. గత ఆరు నెలలుగా కేశవరావు మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు బలగాలకు కచ్చితమైన సమాచారం ఉందని అన్నారు. యూనిఫైడ్ కమాండోలోని ఓ సభ్యుడు ద్రోహిగా మారాడని లేఖలో తెలిపారు.
కేశవరావు ఎన్ కౌంటర్ సమయంలో 20వేల బలగాలు తమను చుట్టుముట్టాయని అన్నారు. 10గంటల వ్యవధిలో ఐదుసార్లు కాల్పులకు దిగారని తెలిపారు. 60గంటల పాటు తమను నిర్భందించారని, అప్పటికే కేశవరావును సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించామన్నారు. అయితే అందుకు నంబాల ఒప్పుకోలేదని వెళ్లడించారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించడమే ఆయనకు ఇష్టమని కష్టంలో పారిపోవడం తనకు తెలియదన్నారు. అయితే అనుకోకుండా నంబాల అమరుడయ్యాడని స్పష్టం చేశారు.
నంబాల కేశవరావు ప్రాణాలు కాపాడటానికి 35మంది ప్రాణాలను అడ్డుపెడితే ఏడుగురం సురక్షితంగా బయటపడినట్లు లేఖలో పేర్కొన్నారు. మిగిలిన వారందరు ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు తెలిపారు. అయితే తాము చాలా రోజుల క్రితమే కాల్పుల విరమణ చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం ఇప్పటికైనా కాల్పుల విరమణ చేసి చర్చలకు పిలవాలన్నారు. పాకిస్తాన్ కోరితే ఆపరేషన్ సిందూర్ ఆపివేసారని తాము కోరితే పట్టించుకోవడం లేదన్నారు మావోయిస్టులు.
ఇదిలా ఉంటే… మావోయిస్టుల మృతదేహాలకు పోలీసులు సామూహిక అంత్యక్రియలు చేశారు. మావోయిస్టు చీఫ్ బసవరాజు సహా ఎనిమిది మంది మావోల మృతదేహాలు దహనం చేశారు. మృతదేహలు కుళ్ళిపోయే పరిస్థితులు ఉండటంతో దహనం చేశారు. నాలుగు రోజులుగా నంబలా కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు.