Mahesh Kumar Warns Ponguleti: మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ సీరియస్.. అలా మాట్లాడొద్దని వార్నింగ్
PCC Chief Mahesh Kumar Goud warns Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని మహేశ్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఇలాంటి అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముందుగానే ప్రజలకు తెలియజేయడం సరైనది కాదన్నారు.
ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద అంశాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాంటి సున్నితమైన సమాచారాన్ని మీడియాకు చెప్పడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉందని తెలిపారు. ఈ తరహా ప్రకటనలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని, కనుక పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని మంత్రులకు టీపీసీసీ చీఫ్ సూచించారు. ప్రతి మంత్రి తమ పరిధిలోని అంశాలకు మాత్రమే స్పందించాలని, కోర్టు పరిధిలో ఉన్న విషయాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలాంటి ఘటనలు మరొకసారి రిపీట్ కావొద్దని వార్నింగ్ ఇచ్చారు.