Siddaramaiah : స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులందరూ గౌరవించాలి.. కన్నడ వివాదంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య

Karnataka CM Siddaramaiah : బెంగళూరులోని ఎస్బీఐలో కన్నడ భాషపై వివాదం జరుగగా, దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బ్యాంకు మేనేజర్ కస్టమర్లతో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు సరైనది కాదన్నారు. స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులందరూ గౌరవించాలని సూచించారు. కస్టమర్లను గౌరవించి, స్థానిక భాషలో మాట్లాడాలని కోరారు. సూర్యనగరలో కన్నడ భాష మాట్లాడటానికి నిరాకరించిన ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఎస్బీఐ మేనేజర్ను బదిలీ చేసిందని, ఇంతటితో ఈ సమస్య సద్దుమణిగినట్లుగా భావిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు..
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతీ భాష వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇటువంటి వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది నేపథ్యం..
కన్నడ భాషలో మాట్లాడాలని అడిగినందుకు బెంగళూరులోని సూర్యనగరలోని ఎస్బీఐ మేనేజర్ కస్టమర్తో వాగ్వాదానికి దిగగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో బ్యాంకు మేనేజర్ను కన్నడ భాషలో మాట్లాడాలని కస్టమర్ అడగాడు. కన్నడలో తప్పనిసరిగా మాట్లాడాలన్న నియమం ఏమైనా ఉందా అని మేనేజర్ ప్రశ్నించారు. ఆమె కస్టమర్తో వాగ్వాదానికి దిగారు. ఎన్నటికీ తాను కన్నడ భాషలో మాట్లాడనని, ఏం చేసుకుంటావో చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వీడియో వైరల్గా మారడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. ఎస్బీఐ ఉద్యోగులు అన్ని ప్రాంతాల్లో కస్టమర్లతో ఇదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. దీంతో ఎస్బీఐ మేనేజర్ను బదిలీ చేసింది.
భాషా సంఘాలు తీవ్ర నిరసన..
ఎస్బీఐ మేనేజర్ వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భాషా సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. కన్నడ భాషపై బ్యాంకు మేనేజర్ తీరును వ్యతిరేకించాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు కర్ణాటక రక్షణ వేదికే సంఘం ప్రకటించింది. ఎస్బీఐ ఉద్యోగులు కస్టమర్లను అగౌరవపరుస్తున్నారని, స్థానిక భాషలో ప్రాథమిక సేవలను అందించడంలో ఎస్బీఐ విఫలమైందని ఆరోపించింది.