Published On:

Man Arrested for Spying Pakistan: పాకిస్థాన్‌కు భారత రక్షణ రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Man Arrested for Spying Pakistan: పాకిస్థాన్‌కు భారత రక్షణ రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Man Arrested for Spying Pakistan: సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌), భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ వ్యక్తి పాక్‌కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్‌లో ఈ ఘటన జరిగింది. సహ్‌దేవ్ సింగ్ గోహిల్‌ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్‌ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకున్నాడని గుజరాత్ ఏటీఎస్‌ ఎస్పీ కె.సిద్ధార్థ్ తెలిపారు. ఆమె పాక్ ఏజెంట్‌ అని తర్వాత అతడు తెలుసుకున్నాడని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న బీఎస్‌ఎఫ్‌, ఐఏఎఫ్‌ సైట్ల ఫొటోలు వీడియోలు ఆమె అడగటంతో వాట్సాప్‌ ద్వారా పంపించాడని ఆరోపించారు.

 

2025 ప్రారంభంలో సిమ్ కార్డు కొనుగోలు..

2025 ప్రారంభంలో గోహిల్ తన ఆధార్ వివరాల ద్వారా సిమ్ కార్డును కొనుగోలు చేశాడని, పాకిస్థాన్ మహిళా ఏజెంట్‌తో సంప్రదింపుల కోసం వాట్సాప్‌ను యాక్టివేట్ చేశాడని ఏటీఎస్‌ ఎస్పీ కె.సిద్ధార్థ్ తెలిపారు. తర్వాత పాక్ ఏజెంట్ ఉపయోగిస్తున్న నంబర్ నుంచి బీఎస్‌ఎఫ్‌, ఐఏఎఫ్‌ సదుపాయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్లు చెప్పారు. గూఢచార చర్యకు పాల్పడిన గోహిల్‌కు గుర్తుతెలియని వ్యక్తి రూ.40వేలు చెల్లించినట్లు ఏటీఎస్‌ నిర్ధారించిందన్నారు.

 

పాక్ మహిళ ఏజెంట్‌పై పలు సెక్షన్ల కింద కేసు..

మరోవైపు ఈ నెల 1వ తేదీన గోహిల్‌ను పిలిచి ప్రశ్నించామని, దర్యాప్తు తర్వాత అరెస్టు చేసినట్లు ఏటీఎస్‌ ఎస్పీ కె.సిద్ధార్థ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న అతడి మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. సహ్‌దేవ్ సింగ్ గోహిల్‌తోపాటు పాకిస్థాన్ మహిళ ఏజెంట్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: