Fire Accident in Hyderabad: అగ్నిప్రమాదంపై ఆరోగ్యశాఖ మంత్రి విచారం.. సీనియర్ డాక్టర్లతో స్పెషల్ టీమ్

Fire Accident in Hyderabad, Health Minister Damodara Raja Narasimha Order Special Team With Senior Doctors: హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రాజేందర్(67), అభిషేక్ మోదీ(30), సుమిత్ర(65), మున్నీబాయి(72), ఆరుషి జైన్(17), శీత్ జైన్(37), ఇరాజ్(2), హర్షాలీ గుప్తా(7), రజి అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇదిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ చనిపోయారు.
ఈ అగ్ని ప్రమాదంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పిల్లలు, వృద్ధులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి మంత్రి దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే సీనియర్ డాక్టర్లతో కూడిన స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేయాలని, ఈ టీమ్లు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ సర్జరీ, అనస్థేషియా, జనరల్ సర్జరీ తదితర విభాగాల డాక్టర్లతో ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాద బాధితులకు ప్రత్యేక బృందాలు మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు.
కాగా, ఉస్మానియాలో నిరంతరం అందుబాటులో ఉండేలా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు పరిస్థితిని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీహెచ్ రవీందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ సమీక్షిస్తున్నారు.