Fish Prasadam: నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లు పూర్తి

Hyderabad: చేప ప్రసాదం పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయాసం, ఉబ్బసం ఉన్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నేడు, రేపు పంపిణీ చేయనున్నారు. అందుకోసం ఆర్ అండ్ బీ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య ఏర్పాట్లతో పాటు మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఇక రెవెన్యూ డిపార్ట్ మెంట్ రోగుల సహాయార్ధం హెల్ప్ కౌంటర్ ఏర్పాటు చేసింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే రోగుల కోసం అల్పాహారం ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చాయి. అలాగే చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి నాంపల్లి గ్రౌండ్ కు చేరుకోవడానికి బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ఇక చేప ప్రసాదం పంపిణీ కోసం ఈ ఏడాది 42 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ వారు లక్షన్నర చేప పిల్లలను సిద్ధంగా ఉంచారు. అవసరాన్ని బట్టి మరిన్ని చేపపిల్లలను పంపిణీ చేసేందుకు రెడీగా ఉన్నారు. చేపప్రసాదం కోసం సమయాన్ని బట్టి ప్రత్యేక టోకెన్లు కూడా ఇవ్వనున్నారు. అలాగే మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. చేపప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా రోగులు రానున్నారు. ఇప్పటికే కొందరు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు.