Hyderabad: నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే ముఠా అరెస్ట్

Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీనగర్లో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుదీర్ బాబు తెలిపారు. ఆరు మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 7 గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5 వందల 71 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనన పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికేట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. ముఠాలో ఉన్న కొందరికి ముందు నుంచే ఫేక్ డాక్యుమెంట్ కేసుల్లో నేర చరిత్ర ఉందని సిపి తెలిపారు. నకిలీ పత్రాలను 5 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు ముఠా అమ్మకాలు చేస్తున్నారని సిపి సుదీర్ బాబు తెలిపారు.
హయత్ నగర్ కు చెందిన తోట వెంకట భాను ప్రకాష్, అతని భార్య సరూర్ నగర్ లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సాత్విక్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో నోటరీలు రాయడంతోపాటు, డీటీపీ ఆపరేటర్ గా బిజినెస్ చేస్తున్నారు. వీళ్లకు లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ అయిన హయత్నగర్కు చెందిన అడ్డగూడూరు చంద్రశేఖర్, ఆయన కొడుకు అనిల్ తోపాటు సివిల్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్గా పనిచేసిన సయ్యద్ ఫిరోజ్ అలీ, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసే అంబర్పేట్కు చెందిన ఎండీ జలీల్ కలిసి ఒక టీం గా ఏర్పడ్డారు. పాత తేదీలతో ఉన్న నకిలీ స్టంప్ పేపర్లను ఒకరు సమకూరిస్తే, మరోకరు సేల్ డీడ్ లు తయారు చేసి, సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్ ను తయారు చేస్తున్నారు.
ఎల్బీ నగర్ లో నకిలీ సర్టిఫికేట్లు తయారవుతున్నాయని తెలుసుకున్న పోలీసులు సీకెట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ అదనపు డీసీపీ షేక్ హుస్సేన్, ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో భానుప్రకాశ్ ఎంటర్ప్రైజెస్లో సోదాలు నిర్వహించారు. ఇందులో 280 నకిలీవని గుర్తించారు. బర్త్ సర్టిఫికెట్లకు కావలసిన హాస్పిటల్స్ డాక్యుమెంట్లను క్రియేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటితో కామారెడ్డి, నార్సింగి, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీల నుంచి పలు బర్త్సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఈ ముఠా తయారు చేస్తుంది. ఈ ముఠాకు చెందిన నల్గొండ పులుసు మల్లేశ్గౌడ్ పరారీలో ఉన్నాడు.