Jagan Comments on Mahanadu: మహానాడు పెద్ద డ్రామా.. వైఎస్ జగన్ హాట్ కామెంట్స్

YS Jagan Comments on Mahanadu 2025: కడప వేదికగా జరుగుతున్న మహానాడుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు అంటేనే పెద్ద డ్రామాగా ఉందని అన్నారు. కడపలో మహానాడు పెట్టి జగన్ ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని సవాల్ చేశారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు అందరి ఇళ్లలో ఉన్నాయన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలే నిలదీస్తారని విమర్శించారు. చంద్రబాబు మహానాడులో ఫోటోలకు పోజులిస్తున్నాడని, టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో ప్రజలు గమినిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆరోపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో రాష్ట్రంలో ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగినా వాటిని సాకుగా చూపి ఏనాడు పథకాల అమలు ఆపలేదన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అమలుచేశామన్నారు.