Banakacharla Project: తెలంగాణకు అన్యాయం జరగనివ్వం.. బనకచర్లపై అఖిలపక్ష రివ్యూపై బీజేపీ ఎంపీలు అరుణ, రఘునందన్ రావు

BJP MPs DK Aruna and RaghuNandan Rao Statements on Banakacharla: ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ ఛాంబర్లో తెలంగాణ అన్ని పార్టీల ఎంపీలతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ రివ్యూలో బీజేపీ తరపున మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా గోదావరి, బనకచర్లపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ ప్రాజెక్ట్తో తెలంగాణ కలిగే ఇబ్బందులు, ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలు, ప్రాజెక్ట్ ఆపేందుకు కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి.
కాగా, బనకచర్లపై బీజేపీ ఎంపీలు డీకే అరుణతో పాటు రఘునందన్ రావు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని కూడా మేము ఒప్పుకోమని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగుతోందన్న అంశాలపై చర్చించామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు.
అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చర్చించిన విషయాలను బీజేపీ ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిసి వివరించారని గుర్తు చేశారు. అలాగే మేము కూడా కేంద్ర మంత్రిని కలిసి తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు.
గోదావరి నదిలో తెలంగాణ వాటా నీటి కేటాయింపుల్లో ఎంత మేర వాడుకున్నామనే వివరాలతో పాటు గోదావరి నదిపై పూర్తికావాల్సిన ప్రాజెక్టులు, ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయారనే విషయాలపై ఆరా తీశారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి అనుమతులు తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఎందుకు ప్రయత్నం చేయలేదనే విషయాలపై ప్రశ్నించారు. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని స్పష్టం చేసింది.