AP CM Chandrababu : ఏపీలో ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలన్నదే నా లక్ష్యం : సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu participates in CII annual conference : సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలు, ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయని చెప్పారు. 1990లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందన్నారు. దానిని ముందుగా అందుకున్న వాళ్లలో తాను ఒకడినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్కు జనాభా అనుకూలత ఉందన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు.
మోదీ నాయకత్వం దేశానికి బలం..
ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం అన్నారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చిందన్నారు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే అన్నారు. తాను నాలుగోసారి సీఎంగా ఉన్నా చాలామంది నాయకులను చూశానని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ప్రధానిగా ఉన్నారని, మోదీ నాయకత్వం దేశానికి బలమన్నారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు..
అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నానని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నానని చెప్పారు. విశాఖపట్నంలో టీసీఎస్ మొదలవుతోందన్నారు. ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతోందన్నారు. విశాఖకు గూగుల్ రాబోతోందని తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం చాలా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయన్నారు.
ఏడాదిలో రూ.5లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నామన్నారు. ప్రాజెక్టుల ద్వారా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. మైనింగ్, టూరిజంలో ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటవుతోందన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలన్నదే తన లక్ష్యమన్నారు. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా 7-8 ఏళ్లు సీఐఐ సదస్సులు నిర్వహించామని గుర్తుచేశారు. మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చానని చంద్రబాబు వివరించారు.